రుద్రూర్: మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో కళ్యాణ మహోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం దేవికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించడంతో పాటు భజనలు, సంకీర్తనలు, పట్టు మహోత్సవ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో కొనసాగాయి. ఆలయం పరిసరాలు విద్యుత్ దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.
ఆదివారం ఉదయం దేవి శోభాయాత్ర నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం దేవి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుందని, భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వారు వివరించారు.


